లక్ష మంది ఎన్నారైలు ఓటర్లుగా నమోదు చేసుకుంటే.. ఓటు వేసింది మాత్రం ఎంతమందో తెలుసా?

తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు లక్ష మంది వరకు ఎన్నారైలు ఓటర్లుగా నమోదు చేసుకుంటే కేవలం 25,606 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్న, దేశ పౌరసత్వాన్ని వదులుకోని మొత్తం 99,807 మంది వివిధ రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో 91,850 మంది పురుషులు, 7,943 మంది మహిళలు, 14 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అయితే వీరిలో లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంది మొత్తం 25,606 మంది. వీరిలో 24,458 మంది పురుషులు, 1,148 మహిళలు ఉన్నారు.మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఎన్నారైలు అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో మొత్తం 85, 161 మంది ప్రవాస భారతీయులు ఓటర్లుగా నమోదు చేసుకుంటే 25, 091 మంది ఓటు వేశారు. అంటే మొత్తం ఓటు వేసిన ఎన్నారైలు 25,606 మంది ఉంటే ఒక్క కేరళలోనే 25, 091 మంది ఓటు వినియోగించుకోవడం విశేషం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 336 మంది(231 మంది పురుషులు, 105 మంది మహిళలు) ఎన్నారైలు ఓటర్లుగా నమోదు చేసుకోగా ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. పుదుచ్చేరిలో 272 మంది, పశ్చిమ బెంగాల్లో 34 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్న ఇక్కడ కూడా ఏ ఒక్కరు ఓటు వేయలేదు. విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం దాదాపు 3కోట్ల 10 లక్షల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు పరోక్ష పద్ధతి(ప్రాక్సీ ఓటింగ్)లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతిపాదించిన బిల్లును 16వ లోక్సభ కాలంలో ప్రవేశపెట్టారు. కానీ ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది. దీంతో తిరిగి ఈ బిల్లును 17వ లోక్సభలో ప్రవేశపెట్టేందుకు న్యాయమంత్రిత్వశాఖ ప్రయత్నిస్తోంది.