
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన సతీమణి రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు దీంతో ఆమె లేని లోటు కనిపించకుండా ఉండడానికి మైనపు విగ్రహాన్ని చేయించి గృహప్రవేశం చేశారు. భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్త గార్లు ఉన్న ఈ లోకంలో మీరు సమ్ థింగ్ స్పెషల్. గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు. ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారీ పెద్దాయన. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే... నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే చేయించాడు. చెప్తే గానీ తెలిసేలా లేదు ఆమె కాదు అది విగ్రహమని. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో. ఈ అద్భుతాన్ని సృష్టించిన కళాకారులూ అభినందనీయులే..! ఈ పెద్దాయన చనిపోయిన తన భార్యపై ఉన్న ప్రేమతో చేపించిన ఈ మైనపు విగ్రహం, దాని వెనుక ఉన్న కధ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ కధ విన్న వారంతా వహ్వా అని కొనియాడక తప్పదు.