
'అల వైకుంఠపురములో' సినిమా విజయంతో కథానాయిక పూజ హెగ్డే రేంజ్ మరింతగా పెరిగిపోయింది. పారితోషికం పెంచినా కూడా నువ్వే కావాలంటూ దర్శక నిర్మాతలు ఆమె డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 'రాధే శ్యామ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో రామ్ చరణ్ సరసన కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ పూర్తి నిడివి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర సరసన కథానాయిక కూడా ఉంటుంది. ఇందుకోసం పలువురు భామలను పరిశీలించిన మీదట ప్రస్తుతం పూజ హెగ్డే తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇందులో నటించడానికి ఆమె కూడా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం వుంది.