
పలు తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన ప్రముఖ నటి ప్రియమణి వివాహానంతరం కూడా పలు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తోంది. ప్రస్తుతం రానా నటిస్తున్న 'విరాటపర్వం', వెంకటేశ్ నటిస్తున్న 'నారప్ప' సినిమాలలో ముఖ్య పాత్రలలో నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి నటించే సినిమాలో ఓ కీలక పాత్రకు ప్రియమణి ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మాతృకలో మంజు వరియర్ పోషించిన కీలక పాత్ర ఒకటుంది. ఈ పాత్రకు గాను పలువుర్ని పరిశీలించిన మీదట తాజాగా ప్రియమణిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.