Nayanthara:దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. ‘లేడీ సూపర్ స్టార్’గా అభిమానుల్లో భారీ క్రేజ్ను సంపాదించుకున్నారు. కథానాయికగా ఒక్కో సినిమాకు భారీ పారితోషికం అందుకుంటున్న ఆమె, నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే నిర్మాణ రంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో నయనతార వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భర్తతో కలిసి నిర్మాణ బాధ్యతలు :
2021లో ‘నెట్రికన్’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన నయనతార(Nayanthara).. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్తో కలిసి నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించారు. విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాతువాకుల రెండు కాదల్’ (KRK) సినిమా మాత్రం కమర్షియల్గా కొంత మేరకు ఫలితాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన కొన్ని ప్రాజెక్టులు మాత్రం పెట్టుబడులకు తగిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయని సమాచారం.
also read:Deepika Padukone:రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ కపుల్స్.. ఈసారి ఎవరంటే..?
‘కనెక్ట్’ నుంచి ‘హాయి’ వరకు :
హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘కనెక్ట్’ సినిమాపై నయనతార ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సాధారణంగా తన చిత్రాల ప్రమోషన్లకు ఎక్కువగా హాజరుకాని ఆమె.. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఇటీవల నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయి’ సినిమాను విగ్నేష్ శివన్, ఎస్ఎస్ లలిత్ కుమార్తో కలిసి ఆమె నిర్మించారు. సుమారు రూ.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లకే పరిమితమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో నిర్మాతలు, బయ్యర్లకు నష్టాలు ఎదురైనట్లు సమాచారం.
also read:Radhika Apte:నగ్నంగా నటించడంపై సంచలన నిర్ణయం తీసుకున్న రాధిక ఆప్టే..!
విగ్నేష్ శివన్ సినిమాకూ ఆశించిన ఫలితం లేదు :
దర్శకుడిగా విగ్నేష్ శివన్కు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో నయనతార కొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిందనే టాక్ వినిపించింది.
ఇక నటనపైనే పూర్తి దృష్టి? :
వరుస ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎదురవుతున్న రిస్క్ను దృష్టిలో ఉంచుకుని ఇకపై నిర్మాణ బాధ్యతలకు దూరంగా ఉండాలని నయనతార భావిస్తున్నట్లు సమాచారం. నిర్మాతగా భారీ మొత్తాలను రిస్క్ చేయడం కంటే కథానాయికగా సినిమాలు చేస్తూ పారితోషికం తీసుకోవడంపైనే దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నయనతార చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో ఓ సినిమా, కోలీవుడ్లో నాలుగు చిత్రాలు, మలయాళంలో మరో ప్రాజెక్ట్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగానికి సంబంధించిన ఒత్తిడిని పక్కన పెట్టి, పూర్తిగా నటనపైనే దృష్టి సారించనున్నారనే ప్రచారం జరుగుతోంది.




