Samantha :ఏ మాయ చేసావే సినిమాతో జెస్సీ పాత్రతో తెలుగు కుర్రకారు హృదయాలను దోచుకున్న సమంత(Samantha) అలియాస్ సామ్ తన అందమైన చిరునవ్వుతో.. అదిరిపోయే యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరినీ అలరిస్తోంది. అలాంటి ఈమె తాజాగా చాలా కాలం గ్యాప్ తీసుకొని తెలుగులో చేస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై.. తన భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru), హిమాంక్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. అన్ని పనులు పూర్తి చేసుకొని జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జూన్ 15న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇటు విడుదల తేదీకి దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సమంత.. నాటి విషయాలను అభిమానులతో పంచుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సక్సెస్ ఇచ్చిన అహంకారం-సమంత
మా ఇంటి బంగారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమంత వరుస విజయాలతో సక్సెస్ ఇచ్చిన అహంకారం కారణంగా.. విజయానికి బానిసయ్యాను అంటూ కామెంట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. “ఒకానొక సమయంలో స్టార్ డం అనే మత్తుకు నేను బానిస అయ్యాను. నేను చేసిన ప్రతి సినిమా వరుసగా హిట్ కావడంతో నాలో అహంకారం కూడా మెల్లగా పెరుగుతూ వచ్చింది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఈ రేంజ్ స్టార్డం దక్కడం అనేది నిజంగా ఆశ్చర్యకరం.. నన్ను నేను చూసుకుని గర్వపడ్డాను. ఆ గర్వమే నాలో అహంకారాన్ని నింపింది” అంటూ సమంత తెలిపింది.
గోల్డెన్ లెగ్ పిలుపుతో ఒత్తిడి కూడా పెరిగింది..
ఒకే ఏడాదిలో ఐదు సినిమాలు చేస్తే అన్నీ హిట్ అయ్యాయి. దాంతో నన్ను గోల్డెన్ లెగ్ అని అందరూ పిలవడం మొదలుపెట్టారు. అయితే ఆ గోల్డెన్ లెగ్ పిలుపు వల్ల నాపై ఒత్తిడి కూడా పెరిగింది. దీంతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నాను. పైగా నటిగా నా కెరియర్ లో ముగింపు ఉండదనుకున్నాను అంటూ సమంత తెలిపింది.
అనారోగ్యమే నాలో ఆలోచనను మార్చేసింది..
అయితే అలాంటి సమయంలో అనారోగ్యం, సడన్ గా సినిమాలకు బ్రేక్ రావడం.. నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. అందుకే తిరిగి సినిమాల్లోకి వస్తే నా పాత అలవాట్లను కొన్నింటిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. విరామం తర్వాత నా జీవితం, కెరియర్ను కొత్త కోణంలో చూసేలా చేసుకున్నాను అంటూ సమంత తెలిపింది. ఇకపోతే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 2022 నుంచి ఆమె మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ వ్యాధి తర్వాత తనలో భారీగా మార్పులు వచ్చాయని.. ఆలోచనలలో కూడా మార్పులు వచ్చాయని.. ఇక ఇప్పుడు కొత్త సమంతను చూడబోతున్నారు అంటూ తెలిపింది. ఇక ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే మరొకవైపు ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది సమంత.


